Swatantra Dinotsavam Poem |మంజుల పత్తిపాటి
స్వాతంత్ర్య దినోత్సవం నాడు
స్వేచ్ఛా గీతాలు పాడుతున్న వేళ
ఒక మూలన అనాథ బాల్యం
అమ్మ ఒడిని వెతుకుతూ ఏడుస్తోంటే…
అనాథ బాల్యం తండ్రి నీడ కోసం తపిస్తూ
కన్నీళ్లనే కౌగిలించుకుంటుంటే…
వారు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేది ఎప్పుడూ?
ఆకాశంలో జెండా మూడు రంగుల్లో
ఎగురుతుంటే… అదే నేలపై
చిన్నారి కళ్లలో ఆకలి రంగు మాత్రమే కనిపిస్తుంటే..!
తమ కడుపు నింపుకోక
దేశం కడుపు నింపిన రైతన్న
కరెంట్ కోత వల్ల….
కోతుల బెడద వల్ల…
రుణాల ఉరితాళ్లతో పోరాడుతుంటే..!
వారు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేది ఎప్పుడూ?
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా
ఆడపిల్ల బయట అడుగు వేస్తే…
భయంతో వెనక్కి చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది..?
చట్టాలు కొందరి చుట్టాలై పోతుంటే…
బాధితుల కన్నీటికి విలువెక్కడుంది..?
స్వాతంత్ర్యం అంటే
కేవలం బ్రిటిష్ సంకెళ్ల నుంచి విముక్తి కాదు…
ఆకలి సంకెళ్ల నుంచి విముక్తి కావాలి…
అనాథ కన్నీటి నుంచి విముక్తి కావాలి..!
మంజుల పత్తిపాటి కలం చెపుతుంది
నిజమైన స్వాతంత్ర్యం అంటే
మనిషి గుండె
భయం లేకుండా కొట్టుకోవాలి అని..!
మంజుల పత్తిపాటి కలం చెపుతుంది
జెండాకు సెల్యూట్ చేస్తున్న మన చేతులు
పక్కనే ఆకలితో ఉన్న చేతిని అక్కున చేర్చుకోవాలి అని..!
దేశభక్తి గీతాలు మన వృదయంలో చిగురించి
సాటి మనిషిని మనిషిగా చూసే రోజు రావాలి..!
ప్రతి ఇంటిపై తివర్ణ పతాకం ఎగరాలి..!
ప్రతి కార్యాలయంలో జాతీయ గీతం పాటాలి..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳 15 ఆగస్టు 2026
మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ,
దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.
జై హింద్! 🇮🇳
వందే మాతరం!
రచన:
శ్రీమతి మంజుల పత్తిపాటి
9347042218
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా

